ఉగాది అంటే యుగ+ఆది …అంటే యుగాదికి ఆది అయిన రోజు అని అర్ధం. బ్రహ్మదేవుడు చైత్ర
శుద్ధ పాడ్యమినాడు ఈ సృష్టిని ఆరంభించడం వల్ల ఉగాది అయ్యింది. పద్నాలుగేళ్ళ వనవాసం
పూర్తిచేసుకున్న రాముడు సీతాదేవితో కలిసి తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన శుభదినం కూడా
ఇదే. ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ
పాడ్యమినాడే అని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని శుభాలు చోటు చేసుకున్న ఈ శుభ
దినాన్ని ’చైత్ర శుద్ధ ప్రతిపద" అని కూడా చెబుతారు.
వాతావరణంలో, సంధ్యాసమయంలో ఆహ్లాదకరంగా వుంటుంది. సంవత్సరంలో వచ్చే
మొదటి ఋతువుగా వసంతాన్ని అభివర్ణించారు. కాలకొలమానంలో మాసం, తిథి
ప్రధాన పాత్రలు వహిస్తాయి.

కాబట్టి, చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర తొలిశుభ దినంగా ప్రాచుర్యంలోకి
వచ్చింది. ఉగాది రోజున మంగళప్రదమైన మామిడి తోరణాలతో గడపలని అలంకరిస్తారు.
కారణం ఏమంటే శివపార్వతుల ఇష్టపుత్రులయిన కుమారస్వామి, గణపతులకు
మామిడి ఫలాలంటే చాలా ప్రియం. అందుకని మామిడి పంట బాగా పండాలంటే
మామిడాకుల తోరణం కట్టాలంటారు.
పుడమితల్లికి ప్రకృతి చేసే పుట్టినరోజు సంరంభం.. ఈ పులకింతల వసంతం !
చెట్లన్నీ ఎర్ర చివుళ్ళు తొడుక్కుని కొత్త ఆశల పందిళ్ళేసుకున్న చందాన అగుపిస్తాయి.
మొక్కలన్నీ సరిక్కొత్త జీవంతో కళకళలాడుతుంటాయి.కాలమంతా రమనీయ దృశ్య
కావ్యంలా…కళ్ళ ముందు కదలాడే ఒకే ఒక ఋతువు ..వసంతఋతువు.

ఉగాది పచ్చడి ఆరగించడంవల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇందులో తీపి, పులుపు, చేదు
వగరు,కారం. అన్ని రుచులు కలగలిసి ఉంటాయి.ఈ ఉగాది పచ్చడిని కొందరు గట్టి
లేపనంగా చేసుకుంటే మరి కొందరు పలుచని ద్రవంలా చేసుకుని కొత్తకుండలో నింపి,
పూజానంతరం గ్లాసులో పోసుకుని సేవిస్తారు.
ఉగాది పండగతో మొదలయ్యే కొత్త సంవత్సరం ఏడాదంతా శోభాయమానంగా గడవాలని,
చేసే వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందాలని, ధనాదాయాలు పుష్కలంగా లభించాలని
ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కలగాలని పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రైతులు
కూడా ఈ పండగ రోజునే ఏరువాక సాగిస్తారు..వసంతం వస్తూనే తన వెంట సంతోషాలను
మోసుకొస్తుంది.

ఈ పండగకు బొబ్బట్లు , పూర్ణాలు, పులిహోర, ప్రత్యేక మైన కూరలు మొదలగునవి
చేసుకుంటారు… సంతోషంగా పూజలు చేసుకుని, సుష్టిగా పంచ భక్ష పరమాన్నాలతొ
భోజనం చేస్తారు
